మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (17:28 IST)

లాక్డౌన్‌పై వెనుకంజ వేస్తున్న కేంద్రం.. ఎందుకో తెలుసా?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. ఎక్కడా అడ్డుకట్ట పడటం లేదు. 
 
అదేసమయంలో కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని అధికారులను ప్రశ్నించగా, దీనిపై వారు ఓ క్లారిటీ ఇచ్చారు. 
 
లాక్డౌన్ విధించే అవకాశాలేవీ లేవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి ప్లాన్ ఏదీ రూపొందించడం లేదని, అయితే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన మార్గదర్శకాలను మాత్రం రూపొందించాలన్నది కేంద్రం ఆలోచనగా ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 
 
అదేసమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని, ముఖ్యంగా వలస కూలీలపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం భావిస్తోందని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ రెండు కారణాలతోనే కేంద్రం లాక్డౌన్‌ దిశగా అడుగులు వేయడం లేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో లాక్డౌన్ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలంచాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది. దీనికితోడు ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికావడంతో లాక్డౌన్ విధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు జాతీయ మీడియా వర్గాల సమాచారం.