1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (10:42 IST)

దేశంలో కొత్తగా మరో 7447 కరోనా కేసులు - 391 మంది మృతి

దేశంలో కొత్తగా మరో 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 391 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రటనను విడుదల చేసింది. 
 
గత 24 గంటల్లో మొత్తం 7447 మందికి ఈ వైరస్ సోకిందనీ, 391 మంది చనిపోయారని అందులో పేర్కొంది. అలాగే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 86,415 మంది వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అలాగే గత 24 గంటల్లో ఈ వైరస్ నుంచి 7,886 మంది కోలుకున్నారు. 
 
ఇకపోతే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 3,41,62,765 మందికి ఈ వైరస్ సోకగా, 4,76,869 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు 1,35,99,96,267 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లను వేశారు. 
 
తెలంగాణాలో 7 ఒమిక్రాన్ కేసులు  
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణాలో 7కి చేరింది. దేశ వ్యాప్తంగ 87కు పెరిగింది. మరోవైపు, కర్నాటక రాష్ట్రంలోనూ కొత్తగా ఐదు కేసులు వెలుగుచూశాయి. వీరిందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం గమనార్హం. దీంతో ప్రతి ఒక్కరిలోనూ ఇపుడు ఆందోళన మొదలైంది. 
 
కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, మహారాష్ట్రలో 32, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో 10, కర్నాటకలో 8, తెలంగాణాలో 7, కేరళలో 5, గుజరాత్‌లో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది. ఇదిలావుంటే, దేశంలో కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తుంది.