శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (17:41 IST)

తేనెటీగల దాడితో ఆగిన క్రికెట్ మ్యాచ్... పరుగులు పెట్టిన రాహుల్ ద్రవిడ్...

క్రికెట్ మ్యాచ్ మధ్యలో అనేకసార్లు అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని వినోదాన్ని పంచుతాయి, మరికొన్ని కాస్తంత కోపాన్ని తెప్పిస్తాయి. అయితే తేనెటీగల దాడి జరగడం అంటే ఓ వైపు తమాషాగా ఉన్నా మరోవైపు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. అలాంటి ఘటనే ఈ రోజు చోటుచేసుకుంది. 
 
భారత్ ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ మైదానంలో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆకస్మాత్తుగా తేనెటీగలు ప్రేక్షకులపై దాడి చేసాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా మైదానం బయటకు పరుగులు తీసారు. తేనెటీగల నుండి తమను తాము రక్షించుకోవడానికి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ మరీ పరిగెత్తారు. 
 
మ్యాచ్‌లో 28వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. తేనెటీగల దాడిలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదని, మైదానంలోకి అవి రాలేదని అధికారులు తెలిపారు. అయితే గ్యాలరీలోని ప్రేక్షకులపై మాత్రం దాడి చేసాయన్నారు. దాడి సమయంలో భారత్- ఏ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అక్కడే ఉన్నాడని, అయితే వాటి నుండి తప్పించుకోవడానికి పరుగు తీసాడని చెప్పారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించినట్లు స్పష్టం చేసారు.