శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (11:21 IST)

హామిల్టన్ వన్డే : భారత్‌కు షాకిచ్చిన బోల్ట్ .. కివీస్ అలవోక విజయం

హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు అలవోక విజయాన్ని అందుకుంది. కేవలం 92 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసింది. నికోల్స్ 30, టేలర్‌లు 37 చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, గుప్తిల్ 14, విలియమ్సన్ 11 చొప్పున పరుగులు చేశారు. దీంతో కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును ట్రెంట్ బోల్ట్‌కు ఇచ్చారు. 
 
అంతకుముందు భారత జట్టు కివీస్ బౌలర్ బోల్ట్ దెబ్బకు కుప్పకూలిపోయింది. కివీస్ బౌలర్ల బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలబడలేక వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫలితంగా భారత జట్టు 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అంతకుముందు ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, ఇప్పటికే జరిగిన మూడు వన్డేల్లో టీమిండియా వరుసగా గెలిచి... సిరీస్‌ను కైవసం చేసుకుంది. గురువారం హామిల్టన్ వేదికగా నాలుగో వన్డే మ్యాచ్ ప్రారంభంకాగా, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు టాప్ ఆర్డర్‌తో పాటు.. బ్యాట్స్‌మెన్స్ అంతా చేతులెత్తేశారు. ఫలితంగా కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ కివీస్ బౌల‌ర్స్‌ని ఏ మాత్రం ప్ర‌తిఘ‌టించ‌కుండానే పెవిలియ‌న్‌కి క్యూ క‌ట్టేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 20 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్ సాయంతో 13 పరుగులు చేసి, జట్టు స్కోరు 21 వద్ద ఉండగా తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రోహిత్ శర్మ 23 బంతుల్లో 7 పరుగులు, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్‌లు వరుస బంతుల్లో డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన గ్రాండ్‌హోమ్ మూడు బంతుల వ్యవధిలో ఇద్దరినీ పెవిలియన్ బాట పట్టించాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ కూడా 21 బంతులు ఎదుర్కొని ఒక్క ఫోరు సాయంతో 9 రన్స్ చేసి నిరాశపరిచాడు. మంచి ఫాంలో ఉన్న కేదార్ జాద‌వ్‌ కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక బౌలర్ భువ‌నేశ్వ‌ర్ ఒక్క పరుగు చేశాడు. అప్పటికి భారత్ స్కోరు 19 ఓవర్లలో 55 ప‌రుగులు. ఏడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాగ్రత్తగా ఆడాల్సిన హార్ధిక్ పాండ్యా (16; 16 బంత‌ుల్లో, 4 ఫోర్స్‌), కుల్దీప్ యాద‌వ్ ( 2, 8 బంతుల్లో)లు అనవసరపు షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. 
 
చివరగా చాహల్ 18 (నాటౌట్), అహ్మద్ 5 చొప్పున పరుగులు చేసి ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ బోల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. అలాగే, గ్రాండ్ హోమ్ కూడా మూడు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ బౌల‌ర్స్‌లో బౌల్ట్ నాలుగు వికెట్లు తీయ‌గా, గ్రాండ్‌ హోమ్ మూడు వికెట్లు తీశారు. ఈ వ‌న్డే రోహిత్ శ‌ర్మ‌కి 200వ‌ది కావ‌డం విశేషం.