1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (13:11 IST)

బీజేపీ ఎజెండా వల్ల భారత్‌లో మతహింస : అమెరికా వార్నింగ్

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే భారత్‌లో మతహింస చెలరేగే అవకాశాలు ఉన్నట్టు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు భారతీయ జనతా పార్టీ హిందుత్వ అంశాన్ని ఎజెండాగా చేసుకోనుందనీ, ఇదే జరిగితే మతహించ తప్పదని ఆ దేశ నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. 
 
ఈ మేరకు సెనేట్ సెలక్ట్ కమిటీకి లిఖిత పూర్వక నివేదికను నేషనల్ ఇంటెలిజెన్స్ సమర్పించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ముప్పులపై అమెరికా నిఘా సంస్థ వేసిన అంచనా ప్రకారం భారత్‌లో మత హింస జరగొచ్చని తేలినట్లు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డాన్ కోట్స్ చెప్పారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి హిందుత్వ ఎజెండాను భుజానికెత్తుకుంటే మత హింస జరిగే ప్రమాదం ఉన్నదని సెలక్ట్ కమిటీకి కోట్స్ వివరించారు. కోట్స్‌తోపాటు ఇతర అమెరికా నిఘా సంస్థల హెడ్స్ సెలక్ట్ కమిటీ ముందు హాజరయ్యారు. 
 
ఇందులో సీఐఏ డైరెక్టర్ గినా హాస్పల్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ రే, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ రాబర్ట్ ఆష్లే ఉన్నారు. మోడీ హయాంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని విధానాల కారణంగా మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందుత్వ వాదాన్ని బలంగా తమ మద్దతుదారుల దగ్గరికి తీసుకెళ్లడానికి కాస్త హింసను కూడా ప్రేరేపించే అవకాశం ఉంది. 
 
మత హింస క్రమంగా పెరగడం వల్ల ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఇండియాలో మరింత బలం పుంజుకునే ప్రమాదం ఉంది అని కోట్స్ తన నివేదికలో స్పష్టం చేశారు. ఇక భారత్‌లో ఎన్నికలు ముగిసే వరకు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం లేదని కూడా ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం, ఎల్‌వోసీలో కాల్పులు విరమణ ఒప్పంద ఉల్లంఘనలు కొనసాగనున్నట్లు అంచనా వేశారు.