మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (20:03 IST)

విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోంది : కివీస్ పోలీసుల ట్వీట్

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు ఆ దేశ పోలీసులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.
 
ఆస్ట్రేలియా క్రికెట్ పర్యటనను ముగించుకున్న కోహ్లీ సేన ఇపుడు న్యూజిలాండ్ దేశంలో పర్యటిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు జరిగిన మూడు వన్డే మ్యాచ్‌లలో భారత జట్టు వరుసగా విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే, వన్డే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. 
 
కివీస్ గడ్డపై భారత జట్టు విధ్వంసం సృష్టిస్తుండడంతో ఆ దేశ పోలీసులు సరదాగా ఓ ట్వీట్ చేశారు. కివీస్ జట్టును హెచ్చరిస్తూనే.. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత జట్టు విధ్వంసం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూజిలాండ్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 
 
తొలి వన్డేలో 8 వికెట్లతో నెగ్గిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో 90 పరుగులతో కివీస్‌ను మట్టికరిపింది. కోహ్లీ అండ్‌ కో ప్రదర్శనకు ఫిదా అయిన ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ పోలీసులు.. సోషల్‌ మీడియా వేదికగా భారత జట్టు ప్రదర్శనను ప్రశంసిస్తూ ఇలా సరదాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
 
'ప్రజలకు పోలీసుల హెచ్చరిక. విధ్వంసకారుల బృందం దేశంలో పర్యటిస్తోంది. గతవారం నేపియర్‌, ఆ తర్వాత మౌంట్‌ మాంగనూ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌లలో అమాయకంగా కనిపించే కివీస్‌ జట్టుపై కనికరం లేకుండా దాడులు చేయడమే అందుకు సాక్ష్యం. క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌ వంటి వస్తువులను మీతో ఉంచుకున్నట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాల'ని ఆ పోస్టులో పేర్కొంది.