టీ పేరుతో మద్యం తాగించి అత్యాచారం... స్నేహితుడే నమ్మించి కాటేశాడు...
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో ఓ దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. స్నేహితుడే నమ్మించి కాటేశాడు. టీ తాగుదామని పిలిచి.. మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తేరుకున్న ఆ బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడుతల విజయ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనతో పాటు చదువుతున్న ఓ యువతితో విజయ్కు మంచి స్నేహం ఉంది. ఈ నెల 14వ తేదీన టీ తాగుదామని ఆ యువతిని తన కారులో ఎక్కించుకుని దిల్సుఖ్ నగర్కు తీసుకెళ్లాడు.
తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేసి, ఆ తర్వాత ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత తన గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన ఆ యువతి తనపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయ్ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
