1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (09:09 IST)

పేమెంట్ గేట్‌ వే నుంచి క్షణాల్లో రూ.1.25 కోట్ల హాంఫట్.. ఎలా?

ఇటీవల డిజిటల్ చెల్లింపుల కోసం అందుబాటులోకి వచ్చిన యాప్‌లలో పేమెంట్ గేట్‌వే ఒకటి. ఈ కంపెనీ ఖాతా నుంచి ఓ సైబర్ నేరగాడు క్షణాల్లో రూ.1.25 కోట్లను మాయం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ మోసంపై బంజారాహిల్స్‌లోని బాధిత కంపెనీ సీఈవో శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 'పేమెంట్‌ గేట్‌వే' పేరుతో ఓ డిజిటల్ కంపెనీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సంస్థ నిర్వహణ కోసం ‘పూల్డ్‌ అకౌంట్‌’లో కొన్ని రూ.కోట్లు ఉంచారు. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ‘పేమెంట్‌ గేట్‌వే కంపెనీ’లో మార్చంటైల్‌గా సభ్యత్వం తీసుకున్నాడు. దీంతో అతడికి డబ్బులు జమ చేయడంతో పాటు ఇతరులకు బదిలీ చేసేందుకూ వెసులుబాటు కలిగింది. 
 
సదరు వ్యక్తికి రూ.20 లక్షలలోపు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ సాంకేతికతపై పూర్తి అవగాహన ఉండటంతో ‘పేమెంట్‌ గేట్‌వే’ ఖాతాను అతడు హ్యాక్‌ చేసేశాడు. దీంతో కొంతసేపు ఆ కంపెనీ లావాదేవీలకు అంతరాయం కలిగింది. ఈ వ్యవధిలో తనకున్న రూ.20 లక్షల పరిమితి దాటి అదనంగా రూ.2 లక్షలు డ్రా చేసి చూశాడు. అతడి ప్రయత్నం ఫలించింది. 
 
ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మరో ఏడు ఖాతాలకు మొత్తం రూ.1.25 కోట్లు బదిలీ చేసుకున్నాడు. ఈ డబ్బులు బదిలీ అయినట్లు సంస్థ యాజమాన్యానికి హెచ్చరిక సందేశం(అలర్ట్‌ మెసేజ్‌) రావడంతో.. అప్రమత్తమైన వారు మరింత డబ్బు పోకుండా పూల్డ్‌ ఖాతాను స్తంభింప చేశారు. ఒడిశాకు చెందిన వ్యక్తే ఇదంతా చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సైబర్‌ పోలీసులు తెలిపారు.