సంబంధిత వార్తలు
- మూడు ముళ్ళు వేసిన వరుడిని పెళ్ళిపీటలపై అరెస్టు చేసిన పోలీసులు!!
- మంకీపాక్స్ నిర్ధారణ కిట్ను ఉత్పత్తి చేసిన ఏపీ మెడ్టెక్!!
- పట్టణ అడవుల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.15.4 కోట్లు..పవన్ కల్యాణ్
- దర్శనం, ఇతర సేవలకు ఆధార్ కార్డ్ వాడండి.. నకిలీతో జాగ్రత్త.. టీటీడీ
- ఏపీకి రూ. 2,500 కోట్లు చెల్లించిన తెలంగాణ.. ఎందుకు?
పురుగుల మందు తాగిన ప్రేమజంట.. ఎందుకో తెలుసా?
ప్రేమ వివాహం చేసుకుని పెళ్లి చేసుకున్న ఓ యువ జంటకు ఓ కుటుంబం ఆశ్రయం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆశ్రయం ఇచ్చిన కుటుంబంపై దాడి చేసింది. దీంతో భయపడిపోయిన ప్రేమ జంట... పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన జంగారెడ్డి గూడెం మండలం అక్కంపేటలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటకు చెందిన ప్రేమికులు పెద్దలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వేరే ప్రాంతంలో ఉంటున్నారు. యువకుడి బంధువైన మైసన్నగూడేనికి చెందిన రాజు వారికి ఆశ్రయం కల్పించాడన్న కోపంతో యువతి తరపు బంధువులు శనివారం ఆయన ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు.
ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేసిన రాజుపై పెట్రోలు పోసి సజీవ దహనం చేసే ప్రయత్నం చేయగా స్థానికులు కల్పించుకుని అడ్డుకున్నారు. అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్రతోపాటు మరో 50 మందికిపైగా తనపై దాడిచేసినట్టు బాధితుడు రాజు ఆరోపించాడు.
అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తల్లి కనకదుర్గ, మేనత్త శశిరేఖపైనా నిందితులు దాడిచేసినట్టు రాజు పేర్కొన్నాడు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
