1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (19:52 IST)

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిని బండరాళ్లతో కొట్టి హతం

crime scene
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం ఇందారంలో అందరూ చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం. మహేష్ (24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గత ఏడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు.
 
దీంతో యువతిపై క్షక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా వున్న వీడియోలను సోషల్ మీడియా పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం యువతి భర్త విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినా పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం ఉదయం మహేష్‌పై కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.