1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

ప్రేమ పేరుతో ఇంజినీరింగ్‌ విద్యార్థినికి చిత్రహింసలు.. వేడి నూనె పోసి..

woman victim
ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంజినీరింగ్‌ విద్యార్థినిని గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. కాళ్లు, చేతులపై వేడి నూనె పోసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన ఆ యువతి ఆదివారం తెల్లవారుజామున తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
తాజాగా పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. ఏలూరులోని శనివారపుపేటకు చెందిన ఓ విద్యార్థిని కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. శనివారపుపేటకు సమీపంలోని దుగ్గిరాలకు చెందిన సదర్ల అనుదీప్‌ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సంవత్సర కాలంగా విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం విద్యార్థినిని దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. రోజూ రాత్రి యువతిని చిత్రహింసలకు గురిచేశాడు. లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. శనివారం అర్థరాత్రి దాటాక విద్యార్థినిని ఉరి వేసి చంపేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఆమె ఆ కిరాతకుడి నుంచి తప్పించుకుని, తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
నిందితుడు అనుదీప్‌ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన అనుదీప్‌.. చాలా మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించాడని చెప్పారు. ఏలూరు ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీ పడేశ్వరరావు ఆదేశాల మేరకు మూడో పట్టణ సీఐ వరప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.