శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (08:44 IST)

ముక్కుపచ్చలారని పిల్లను వాగులో పడేసి చంపిన కన్నతల్లి.. ఎక్కడ?

murder
వారిద్దరికీ అభంశుభం తెలియదు. అలాంటి ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను ఓ కన్నతల్లి వాగులో పడేసింది. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోనినాగారం సమీపంలోని చక్రనగర్ తండాకు చెందిన అరుణ, మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన మోహన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి అనోన్య, యువరాజు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచుగా గొడవలుపడసాగారు. దీంతో అరుణ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో మనసు మార్చుకున్న మోహన్.. భార్యకు ఫోన్ చేసిన ఉద్గీర్‌కు రావాలని చెప్పాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉద్గీర్‌కు బయలుదేరిన అరుణ.. బాన్సువాడ శివారులోని వాగులో ఇద్దరు పిల్లలను పడేసింది. దీన్ని స్థానికులు గుర్తించి ఆ ఇద్దరు పిల్లలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే, వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అరుణను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆటోలో వస్తుండగా తనపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీంతో ఇద్దరు పిల్లలను వాగులో పడేసి అతని నుంచి తప్పించుకుని పారిపోయినట్టు చెప్పాడు. 
 
అయితే, ఆమె మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, అస్సలు అటుగా ఆటో వెళ్లిన ఆనవాళ్లే లేవని తేలింది. దీంతో అరుణను అరెస్టు చేశారు. అయితే, ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లను చంపడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.