1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (12:06 IST)

పురుగుల మందు తాగిన కుటుంబం... భర్త మృతి.. భార్య విషమం

sayilu couple
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన సాయిలు (40) అనే వ్యక్తికి భార్య రేఖ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయిలు చేతికి అందిన చోటల్లా అప్పులు చేశాడు. వాటిని సకాలంలో తిరిగి చెల్లించలేక పోవడంతో అప్పులిచ్చిన వారు వేధించసాగారు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆ నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ సాయిలు ప్రాణాలు కోల్పోయాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు వెల్లడించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.