1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (15:48 IST)

డబ్బులన్నీ రెండో భార్యకే ఇస్తున్నాడనీ తండ్రిని సుత్తితో కొట్టి చంపేసిన కొడుకు

murder
హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. సంపాదించిన డబ్బులన్నీ రెండో భార్యకే ఇస్తున్నాడన్న కోపంతో కన్నతండ్రిని కుమారుడు సుత్తితో కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్‌‍లోని సూర్య అపార్ట్‌మెంట్‌లో పాండు సాగర్ (54) అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈయన నాలుగేళ్ల క్రితం పీర్జాగూడకు చెందిన విజయలక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన రెండో భార్యను, ఆమె పిల్లలను ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
పైగా, రెండో భార్య వద్దే ఉండసాగాడు. పాండుసాగర్ తమను పట్టించుకోవడం లేదని, సంపాదన అంతా విజయలక్ష్మికే ఇస్తున్నాడని మొదటి భార్యతో పాటు పిల్లలు కూడా ఆరోపించసాగారు. ఇదే విషయంపై పెద్ద కుమారుడు పవన్ (25) తన తండ్రితో గొడపడసాగాడు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన తండ్రి రామాంతపూర్‌ పరిధిలోని శ్రీనివాసపురంలోని ఓ అపార్టుమెంటులో అద్దెకు తీసుకున్న ఇంటిలో ఉంటున్న విషయం తెలుసుకున్న పవన్.. అక్కడకు వెళ్లి తండ్రితో గొడవపడ్డాడు. ఇది పెద్దది కావడంతో తీవ్ర ఆగ్రహానికుగురైన పవన్... తండ్రిని సుత్తితో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పాండుసాగర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.