శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (16:02 IST)

హుజూర్ నగర్ బై-పోల్స్.. పవన్ వద్దకు వెళ్లిన వీహెచ్.. ప్రచారం చేయాలని..?

తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌‌ను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి క్రేజ్ తగ్గిపోతున్న నేపథ్యంలో.. పవర్ స్టార్‌ను బరిలోకి దింపితే ఎలా వుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ వుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికను పావులా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 
 
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం.. అధికార టీఆర్ఎస్ మొదలు అన్ని పార్టీలు విజయం సాధించటానికి మద్దతిచ్చే వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పాత రాజకీయాలను మరించి హుజూర్ నగర్‌లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా సీపీఐ మద్దతు సంపాదించింది. ఇక, సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురైంది. 
 
అలాగే టీడీపీ సైతం ఈ ఎన్నికల బరిలో నిలిచింది. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రస్తుతం ప్రధాన పోటీ జరుగనుంది. అందులోనూ కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో ఎలాగైనా గెలవాలని అధికారిక పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్.. కేసీఆర్ పార్టీకి గట్టిపోటి ఇచ్చే దిశగా పోటీలో తమ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని కోరుతూ జనసేన కార్యాలయానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ మద్దతు కోరుతూ లేఖ ఇచ్చారు.
 
కాంగ్రెస్ తరపున హుజూర్‌నగర్ బైపోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న పద్మావతి రెడ్డికి మద్దతు ఇవ్వాలని వీహెచ్ జనసేన కార్యాలయానికి వెళ్లగా.. పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో చికిత్స కారణంగా అందుబాటులో లేరని అక్కడి నేతలు సమాధానమిచ్చారు. దీంతో.. జనసేన తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్.. పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్‌తో చర్చలు చేసారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు కోరుతూ అధికారికంగా లేఖ అందించారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరారు. 
 
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ కోరినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనాని మద్దతుగా నిలుస్తారా అనేది అనుమానమే. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే తెలంగాణతో పాటుగా ఏపీలోనూ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వామపక్షాలు పోటీలో లేవు. వామపక్ష పార్టీల్లో సీపీఐ అధికార టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుండగా, సీపీఎం పోటీలో లేదు. దీంతో జనసేన అధినేత సైతం ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా మౌనం పాటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.