శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (21:41 IST)

ఆపరేషన్ లోటస్.. తమిళనాడులో ఆ పార్టీకి రంగుపడింది?

తమిళనాడు ఎన్నికలకు మరో సంవత్సరం మాత్రమే ఉంది. దీంతో బిజెపి తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఏకంగా డిఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేను తనవైపు తిప్పేసుకుంది బిజెపి. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో సీనియర్ ఎమ్మెల్యే సెల్వం బిజెపిలో చేరుతుండటం ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
 
తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డిఎంకే పార్టీ ఎమ్మెల్యే కేంద్ర రైల్వే శాఖామంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. ఆ తరువాత బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను కలిశారు. దీంతో డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌కు కోపమొచ్చింది. డిఎంకే పార్టీ ఎమ్మెల్యే సెల్వంను పార్టీ నుంచి తొలగించారు. 
 
సెల్వం డిఎంకేలో సీనియర్ ఎమ్మెల్యే. పార్టీ అధిష్టానం దృష్టికి రాకుండా బిజెపి నేతలను ఎలా కలుస్తారు అంటూ డిఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సెల్వం బిజెపిలోకి వెళ్ళేందుకు సిద్థమయ్యారు. అంతేకాదు తనతో పాటు మరికొంతమందిని బిజెపిలోకి తీసుకెళ్ళేందుకు సిద్థమైపోయారు.
 
ఇప్పటికే డిఎంకే పార్టీలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పార్టీ వ్యవహారంలో తలదూర్చడం.. దాంతో పాటు సీనియర్లకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదనకు గురవుతున్నారు. డిఎంకేలో అసంతృప్తిగా ఎంతోమంది నేతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 
 
వీరందరూ కూడా బిజెపిలో చేరేందుకు సిద్థమైపోతున్నారట. గత నాలుగు సంవత్సరాలుగా బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అగ్రనేతలు. అయితే అది కాస్త ఫలించలేదు. ప్రస్తుతం డిఎంకే ఎమ్మెల్యే సెల్వంతో ఆపరేషన్ ప్రారంభించి మెల్లిగా మిగిలిన నేతలను తమ పార్టీలోకి తీసుకుని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారట బిజెపి అగ్రనేతలు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆపరేషన్ లోటస్ వ్యవహారం కాస్త తీవ్ర చర్చకు దారితీస్తోంది.