Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)
భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్థాన్ దేశంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసిందని ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అసదుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు.
అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదని ఓవైసీ తెలిపారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలని అసదుద్ధీన్ ఓవైసీ గుర్తు చేశారు.
పహల్గామ్లో కుటుంబ సభ్యుల ముందు అతికిరాతకంగా ఉగ్రమూకలు హతమార్చారని.. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని తెలిపారు. భారత దేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా వున్నారని.. సైనికులకు అండగా వుంటామని అసదుద్ధీన్ ఓవైసీ స్పష్టం చేశారు.