శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (14:44 IST)

కరోనా వైరస్ అనుమానితుల బస్సుకు నిప్పు... ఆందోళనకారుల దుశ్చర్య

కరోనా వైరస్ అనుమానితుల బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కరోనా వైరస్ బారినపడినవారు జీవించివుండటానికి వీల్లేదని పేర్కొంటూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఉక్రెయిన్ దేశంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల 45 మంది ఉక్రెనియా వాసులు, 27 మంది విదేశీయులు వుహాన్ నుంచి ఖార్కివ్ ప్రాంతానికి వచ్చారు. వారందరినీ ఆరు బస్సుల్లో నోవి సంఝారీ హాస్పిటల్‌కు పరీక్షలకు నిమిత్తం తీసుకొచ్చారు. ఆ తర్వాత వారందరినీ పరిశీలనలో ఉంచి 14 రోజుల తర్వాత ప్రత్యేక బలగాలతో వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు ఆందోళనకారులు... ఈ వైరస్ బారినపడివారు జీవించివుండటానికి వీల్లేదని పేర్కొంటూ వారిని తరలిస్తున్న బస్సుకు నిప్పంటించారు. అయితే, అదృష్టవశాత్తు వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 'నోవీ సంఝారీ హాస్పిటల్ లో జరిగిన ఆందోళన ఇప్పటికైనా ప్రశాంతం అవుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. వుహాన్ నుంచి వచ్చినందుకు అనుమానంతోనే ఇలా చేశామని నిజానికి ఎవరూ కరోనా రోగులు కాదని ఆరోగ్య శాఖ చెప్పింది. 
 
'ప్రయాణికుల్లో చాలా మంది 30 ఏళ్లలోపు వారే. మనమంతా మనుషులమే. వుహాన్‌లో ప్రాణాలు వదిలిన వారు కూడా మనలాంటి వాళ్లేనని గుర్తుంచుకోవాలి' అని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 76 వేల కోవిడ్-19 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2247మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.