గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:08 IST)

హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్‌పై ట్రంప్ కామెంట్స్.. ఘాటుగా బదులిచ్చిన భారత్

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 చికిత్సకు బాగా పనిచేస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, 'పారాసిటమాల్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు డ్రగ్స్ తయారీలో పేటెంట్స్ పొందడంతోపాటు, తయారీలోనూ ముందున్న భారత్‌పైనే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి.
 
ఇలాంటి తరుణంలో అమెరికా స్పెషల్ ప్రివిలేజ్ కావాలని.. వెంటనే ''హైడ్రాక్సీ క్లోరోక్విన్‌''ను సరఫరా చేయకుంటే ప్రతీకారం తప్పదని తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కానీ ట్రంప్‌కు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. 
 
ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కంటున్నవేళ.. ఒకరికొకరం అండగా నిలబడాలేతప్ప.. చీప్ పాలిటిక్స్ సరికాదని ట్రంప్‌కు భారత ప్రభుత్వం నొక్కి వక్కాణించింది. ఇంకా ఆ రెండు డ్రగ్స్‌పై మోదీ సర్కార్ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
 
దాదాపు అన్ని దేశాలూ కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసిటమాల్ వాడుతున్నందున, మానవతా దృక్పథంతో ఆ రెండు డ్రగ్స్ ఎగుమతులపై కొనసాగుతోన్న నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మంగళవారం మీడియాకు వెల్లడించారు. 
 
విపత్తు సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఒకటిగా పనిచేయాలన్నది భారత్ అభిమతమని, అంతర్జాతీయ సమాజానికి అవసరమైన సహకారం అందించడంలో ఏనాడూ వెనుకడుగు వేయలేదని, మానవతా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు డ్రగ్స్ సరఫరా పునరుద్ధరిస్తామని శ్రీవాస్తవ వెల్లడించారు. 
 
కచ్చితంగా ఇండియా కూడా దేశీయ అవసరాలకు సరిపడా 'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌', 'పారాసిటమాల్' నిల్వలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎగుమతులకు అంగీకరారం తెలిపింది. అందరికంటే ముందు, భారత్‌ను నమ్ముకున్న పొరుగుదేశాలకు మందుల్ని సరఫరా చేస్తాం. ఆ తర్వాత కొవిడ్-19తో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన ఇతర దేశాలకు పంపుతాం'' అని శ్రీవాస్తవ క్లారిటీ ఇచ్చారు.
 
ప్రస్తుత వివపత్కర పరిస్థితుల్లో అన్ని దేశాలూ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలే తప్ప.. అనవసర రాజకీయాలు చేయాలనుకోవడం ఏమాత్రం సరికాదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను ఉద్దేశించి శ్రీవాస్తవ అన్నారు. ఇప్పటి వాతావరణంలో ఇంతకు మించి భారత ప్రభుత్వం ఏమీ అనదల్చుకోలేదని, పొరుగుదేశాల అవసరాలు తీర్చిన వెంటనే, మిగతా దేశాలకు కూడా మందులు సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.