శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:07 IST)

రైళ్లు నడుస్తాయో లేదో తెలియదుకానీ... బుకింగ్సన్నీ హౌస్‌ఫుల్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే, లాక్‌డౌన్ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. 15వ తేదీ నుంచి రైళ్ళ రాకపోకలు ప్రారంభమవుతాయనే ప్రచారం సాగుతోంది. అయితే, రైళ్ళు నడుస్తాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ, ఈ నెల 15, 16 తేదీల్లో మాత్రం రైళ్ల బుక్కింగ్స్ అన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. 
 
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా నాలుగు రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్ ప్రారంభంకాగా, 15, 16 తేదీలకు దాదాపు అన్ని రైళ్లకూ బుకింగ్స్ పూర్తికాగా, కొన్ని రైళ్లలో 100 వరకూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చి, తిరిగి వెనక్కు వెళ్లలేకపోయిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఒకవేళ లాక్‌డౌన్ కొనసాగినట్లయితే, ఆన్‌లైన్‌లోనే టికెట్ల రద్దునకు అవకాశం ఉండటంతో, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకుంటున్నారు. ఇక ఈ వేసవిలో పిల్లా జెల్లాతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్న వారిలో అత్యధికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో, కొన్ని రైళ్లలో మే, జూన్ నెల ప్రయాణాలకు టికెట్లు కనిపిస్తున్నాయి. 
 
ఇక రైళ్లు తిరుగుతాయా? తిరగవా? అన్న విషయం 10వ తేదీ తర్వాత కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, దేశంలో కరోనా వ్యాప్తి తదితరాలను సమీక్షించిన తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉంది.