శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (10:17 IST)

కరోనా అప్‌డేట్స్... 9 గంటలకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కొత్తగా నమోదైయ్యే కేసుల సంఖ్య వందల్లో ఉంటోంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. 
 
మంగళవారం ఉదయం 9 గంటలకు దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4421కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసులు 3981 కాగా, వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 114కు చేరింది. మరో 325 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 354 కేసులు నమోదు కాదు. ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలు అందిస్తూ వచ్చిన 24 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ ఆస్పత్రిలోని ఇన్‌పేషంట్లను మరో ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఆస్పత్రిని ఖాళీ చేసి శానిటైజ్ చేశారు. వైరస్ సోకిన వైద్య సిబ్బందితో కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కూడా పరిస్థితి ఏమాత్రం అదుపుకావడం లేదు. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే, అమెరికాలో మాత్రం వైరస్ విశ్వరూపం దాల్చింది. ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక కరోనా రోగి ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఇక న్యూయార్క్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 10,700 మందికిపైగా మృత్యువాత పడగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే ఏకంగా 1150 మంది మృతి చెందారు. మరోపక్క, ఇటలీ, స్పెయిన్‌లలో గత వారం రోజులుగా మరణాల రేటు తగ్గుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం.
 
ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రివరకు మొత్తం 72,636 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క యూరప్‌లోనే 50,215 మంది మరణించారు. మొత్తం 13 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఇటలీలో 16,523 మంది, స్పెయిన్‌లో 13,169 మంది మృతి చెందారు. 
 
ఫ్రాన్స్‌లో 8,911 మంది బలికాగా, ప్రపంచవ్యాప్తంగా 2.75 లక్షల మంది కరోనా నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇక, వైరస్ పురుడుపోసుకున్న చైనాలో మాత్రం 3,331 మరణాలే సంభవించాయి. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో కోవిడ్-19 కబంధ హస్తాల నుంచి చైనా త్వరగానే తప్పించుకోగలిగింది.