శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (12:40 IST)

అత్యవసర దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు ఎగుమతి : భారత్

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారికి తాత్కాలిక విరుగుడుగా మలేరియాను నివారించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ మాత్రలను ఉపయోగిస్తున్నారు. ఈ మాత్రలను భారత్ రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఈ మాత్రలను ఎగుమతి చేయాలని అనేక ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికా కూడా పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. 
 
ప్రపంచ దేశాల డిమాండ్‌ మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరంగా అవసరమున్న దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవతా కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారాసిట్మామాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తగిన పరిమాణంలో పొరుగు దేశాలకు సరఫరా చేస్తామని చెప్పింది. 
 
ఈ మెడిసిన్స్‌ను అత్యవసరంగా అవసరమున్న దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌ను కోరిన విషయం విదితమే. బ్రెజిల్‌, స్పెయిన్‌తో సహా కరోనా ప్రభావవంతంగా ఉన్న దేశాలు ఈ మెడిసిన్స్‌ను సరఫరా చేయాలని కోరింది. ఈ మెడిసిన్స్‌ సరఫరాను రాజకీయం చేయొద్దని కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. 
 
కరోనా దృష్ట్యా దేశంలో ఔషధాల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. మార్చి 3వ తేదీ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ తాజాగా మరో నోటిఫికేషన్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ జారీ చేసింది. 12 రకాల యాంటీ బయోటిక్స్‌, 12 రకాల ఫార్ములేషన్లపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది.