1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Dangerous Escalation : India Condemns Attack On UAE Nuclear Plant

బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి : ఇరాన్ చర్యేనా?

nuclear plat balst
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యేలా ఆయా దేశాలు నడుచుకుంటున్నాయి. ఇందులోభాగంగా, యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. యూఏఈకి దాదాపు 25 శాతం విద్యుత్‌ను అందించే ఈ కీలక కేంద్రంపై దాడి జరగడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని భారత్ సహా పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. 
 
ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 'యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. తక్షణమే ఇరు పక్షాలు సంయమనం పాటించి.. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి' అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.
 
యూఏఈ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. పశ్చిమ సరిహద్దు నుంచి మూడు డ్రోన్లు దేశంలోకి ప్రవేశించాయని, వాటిలో ఒకటి అణు కేంద్రం లోపలి ప్రాంగణంలో పడగా, మరో రెండింటిని కూల్చివేసినట్లు తెలిపారు. ఈ దాడిని "అకారణంగా జరిగిన ఉగ్రవాద చర్య"గా యూఏఈ ప్రభుత్వం అభివర్ణించింది. తమ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఎలాంటి చర్యలను సహించబోమని, ప్రతీకారం తీర్చుకునే పూర్తి హక్కు తమకుందని హెచ్చరించింది.
 
దాడి జరిగిన వెంటనే యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులతో ఫోనులో మాట్లాడారు. ఈ దేశాలన్నీ దాడిని ఖండిస్తూ యూఏఈకి మద్దతు ప్రకటించాయి. యూఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ మాట్లాడుతూ, ఈ దాడి వెనుక ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థల హస్తం ఉండొచ్చని ఆరోపించారు. 
About Writer
ఠాగూర్