1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (11:56 IST)

క్షణాల్లో 12 అంతస్తుల భవనం నేలమట్టం... 99 మంది మిస్సింగ్

ఫ్లోరిడాలో 12 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టమైంది. ఈ ఘటన తర్వాత సుమారుగా వంద మంది వరకు మిస్సింగ్ అయినట్టు సమాచారం. వీరి కోసం రెస్క్కూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీరంతా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వీరిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన అమెరికా ఫోర్లిడాలోని మియామి నగరంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మియామిలోని ఓ 12 అంతస్తుల బిల్డింగ్‌లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 102 మంది ఆచూకీ లభించిందని.. మరో 99 మంది గురించిన సమాచారం తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో బిల్డింగ్‌లో మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.
 
సర్ఫ్‌సైడ్‌లో ఉన్న ఈ భవనాన్ని 1980లో నిర్మించారు. అయితే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపుగా బిల్డింగ్ సగభాగం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ కూలిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని.. క్షణాల్లో ఆ ప్రాంతంలో దుమ్ము, ధూళితో నిండిపోయిందని స్థానికులు తెలిపారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 35 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరిని ఆస్పత్రికి పంపగా, మిగిలినవారి గాయాలకు ప్రథమ చికిత్స చేశారు.