శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (10:34 IST)

ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేస్తే చిక్కుల్లో పడనున్న భారతీయ విద్యార్థులు

తమ దేశంలో ఉన్నత విద్యాభ్యాసం చేసే విదేశీ విద్యార్థులకు అమెరికా చట్టసభ సభ్యులు ఓ విజ్ఞప్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన చట్ట సభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయ్యాక స్వదేశాలను వెళ్లాల్సిందేనని వారు కోరుతున్నారు. ఈ మేరకు అమెరికా చట్టాల్లో మార్పులు కోరుతున్నారు. 
 
చాలా మంది విదేశీ విద్యార్థులు చదువు పూర్తయినా అక్కడే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలుకల్పించే ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ బిల్లును సైతం ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తి కాగానే స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
 
ఓపీటీ ఆధారంగా అమెరికాలో ఉంటున్న 80 వేల మంది భారతీయ విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పవు. ఓపీటీని తొలగించడం కోసం ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌’ పేరుతో ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 
 
ఓపీటీ వల్ల అమెరికాకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారు. విదేశీ విద్యార్థులు తక్కువ వేతనాలకు లభిస్తుండటంతో అమెరికాలోని వ్యాపార సంస్థలు వారికే ఉద్యోగాలిస్తున్నాయని, స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని వారు ఆరోపించారు.