1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (09:53 IST)

దీపావళికి జియో నెక్స్ట్ ఫోన్ రిలీజ్ - టార్గెట్ 30 2జీ కస్టమర్లే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ జియో నెక్స్ట్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల 2జీ వినియోగదారులే లక్ష్యంగా మార్కెట్లోకి జియోఫోన్‌ నెక్స్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తున్నది. కాగా, భారతీయుల కోసం భారతదేశంలో భారతీయులే ఈ ఫోనును తయారు చేయడం గమనార్హం. ఈ ఫోన్ కోసం జియో ప్లాట్‌ఫామ్స్‌, గూగుల్‌ సంయుక్తంగా ఓ సరికొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)ను అభివృద్ధి చేశాయి. ప్రగతి ఓఎస్‌ పేరుతో ఈ టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చాయి. 
 
దీపావళి సందర్భంగా వచ్చే వారం మార్కెట్‌లోకి జియోఫోన్‌ నెక్స్‌ విడుదలవుతుందన్న అంచనాల మధ్య సోమవారం రిలయన్స్‌ జియో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ప్రగతి ఓఎస్‌ ఆధారంగా జియోఫోన్‌ నెక్స్‌ పనిచేస్తుందని సంస్థ తెలియజేసింది.
 
 దేశంలో భిన్నమైన వ్యవహారిక భాషలున్న దృష్ట్యా తమ ఫోన్‌లో ప్రత్యేకంగా లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జియోఫోన్‌ నెక్స్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన బినిష్‌ పరంగోదత్‌ తెలిపారు. 10 భారతీయ భాషల్లో ఈ అనువాద ఫీచర్‌ పనిచేస్తుందని చెప్పారు.
 
'ఈ కొత్త ఓఎస్‌ మాకు గర్వకారణం. ముఖ్యంగా ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఒక భాషలో మాట్లాడితే.. మరో భాషలోకి ఈ ఫోన్‌ దాన్ని అనువదించగలదు. జియోఫోన్‌ నెక్స్‌తో భారత్‌ మరింత ఆత్మనిర్భర్‌ కాగలదు' అని అన్నారు. 
 
స్క్రీన్‌పై ఏ యాప్‌ నుంచి తెరుచుకున్న విషయాన్నైనా మొబైల్‌ వినియోగదారుడు వినేలా రీడ్‌-అలౌడ్‌ ఫంక్షన్‌ను జియోఫోన్‌ నెక్స్‌లో పెట్టినట్లు ఫోన్‌ తయారీ, సరఫరాదారు అశోక్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇందులో క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ ఉండగా, తిరుపతి-శ్రీపెరంబుదూర్‌లోగల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ నియోలింక్‌ కేంద్రంలో ఫోన్‌ తయారవుతుంది.