శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (16:47 IST)

త్వరలో జియో ఫైబర్‌ సేవలు .. రూ.500తో యూఎస్‌కు అపరిమిత కాలింగ్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్‌ మాట్లాడుతూ.. 'సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభిస్తాం' అని తెలిపారు.
 
1600 నగరాల్లోని 2 కోట్ల నివాసాలు, 1.5 కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం జియో ఫైబర్‌ ఫీచర్లను ఇషా, ఆకాశ్ అంబానీ వివరించారు. జియో సెట్‌టాప్‌ బాక్సు ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్‌ సేవలు ఉచితంగా చేసుకోవచ్చని వెల్లడించారు. 
 
ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జియో గిగా ఫైబర్‌ ద్వారా సోషల్‌ గేమింగ్‌ పేరుతో మల్టిపుల్‌ గేమింగ్‌ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. మిక్స్‌డ్‌ రియాలిటీ పేరుతో సరికొత్త వర్చువల్‌ రియాలిటీ సేవలు అందిస్తామని తెలిపారు. 
 
జియో ఫైబర్‌ విశేషాలు..
 
* జియో ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు డేటా
* ప్రజలందరికీ అందుబాటు ధరల్లో జియో సేవలు. జియో ఫైబర్‌ సేవలు నెలకు రూ. 700 నుంచిరూ. 10వేల వరకు ఉంటాయి 
* ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. 'జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో'గా పిలిచే ఈ సేవలను 2020 మధ్యలో అందుబాటులోకి తీసుకొస్తాం.
* జియో ఫైబర్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ఉచిత సేవలు జీవితకాలం ఉంటాయి
* ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లు హెచ్‌డీ/4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా తీసుకోవచ్చు
.* జియో నుంచి నెలకు రూ.500తో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్‌ ప్యాకేజీ.