గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (19:42 IST)

5జీ టెక్నాలజీ రంగంలోకి టీసీఎస్.. జియోతో వార్ తప్పదా?

5G technology
5జీ టెక్నాలజీ రంగంలో రాణించేందుకు టీసీఎస్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జియోకు పోటీగా నిలవనుందని టాక్ వస్తోంది. తాజాగా టాటాలకు చెందిన ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు రెండు కొత్త విభాగాలను సృష్టించటం సంచలనంగా మారింది. ఇవి 5జీ సేవలకు సంబంధించినవి కావడంతో చర్చ మొదలైంది.  
 
ఆదాయం పరంగా టీసీఎస్ దేశంలోని ఐటీ కంపెనీల్లో అతి పెద్దదిగా ఉంది. అయితే కంపెనీ ప్రస్తుతం 5G సేవలు, నెట్‌వర్క్, ఇతర సంబంధింత వ్యాపారాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. టెలికాం కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటాలు సిద్ధమయ్యారు.
 
కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెలికాం.. 5G సొల్యూషన్స్ అనే కొత్త విభాగాలను సృష్టించింది. వీటి కోసం అధిపతిగా ఇద్దరు కీలక వ్యక్తులను సైతం నియమిస్తుంది. చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా సన్స్ టీసీఎస్ కొత్త శిఖరాలకు చేరుకునేందుకు అడుగులు వేస్తోంది. 
 
టీసీఎస్ 5G సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి తన కమ్యూనికేషన్స్, మీడియా విభాగంలో నెట్‌వర్క్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ యూనిట్‌ను సృష్టించింది. నెట్‌వర్క్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ విభాగానికి విమల్ కుమార్ నేతృత్వం వహిస్తారని కంపెనీ వెల్లడించింది. 
 
టాటా కంపెనీ 5జీ రంగంలోకి దిగడంతో దేశీయ టెలికాం దిగ్గజం జియోకు రానున్న కాలంలో గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.