షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ కేసులో కీలక మలుపు - ప్రధాన నిందితుడు ఆత్మహత్య
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన కొద్ది రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. సింగరేణి కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ అమూల్య మృతి కేసులో మహేష్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇటీవలే కోర్టు నుంచి బెయిల్పై మహేష్ విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకోగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది. అలాగే, మహేష్ మొబైల్ ఫోన్, కాల్ లాగ్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బెయిల్ తర్వాత ఎవరైనా అతన్ని బెదిరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణ పట్ల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశంపై కూడా విచారణ సాగుతోంది.
