1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:15 IST)

లాక్డౌన్ జాబితాలో మరో రాష్ట్రం.... గోవాలో మే 3 వరకు..

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం అటు కేంద్రంతో పాటు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్‌ను విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక వంటి రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇపుడు మరో రాష్ట్రం లాక్డౌన్ రాష్ట్రాల జాబితాలో చేరింది. ఆ రాష్ట్రం గోవా. 
 
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో గోవా కూడా లాక్డౌన్ విధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం మధ్యాహ్నం లాక్డౌన్‌పై ప్రకటన చేశారు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుందని, మే 3 దాకా ఐదు రోజులపాటు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. లాక్డౌన్ కాలంలో కేవలం అత్యవసర, నిత్యవసర సేవలు, పారిశ్రామిక కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
 
ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. కాసినోలు, హోటళ్లు, పబ్‌లనూ పూర్తిగా మూసేస్తున్నట్టు వెల్లడించారు. నిత్యవసరాల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులను తెరిచే ఉంచుతామన్నారు. ప్రస్తుతం గోవాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 31 మంది చనిపోగా, 2,110 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మొత్తంగా ఆ రాష్ట్రంలో 81,908 మంది కరోనా బారిన పడగా.. 1,086 మంది చనిపోయారు.