1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (18:38 IST)

'సరి-బేసి' విధానం కొనసాగేనా?

సరి-బేసి విధానం ముగియడంతో శనివారం నుంచి అన్ని వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. దాంతో మరింత కాలుష్యం పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవాళ కూడా ఢిల్లీలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ విద్యార్థులకు శ్వాసకోస సమస్యలు, ఆస్తమ తదితర రోగాలు వస్తున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగులబెట్టడం తగ్గినా.. కాలుష్య ప్రభావం మాత్రం ఢిల్లీలో అంతగా తగ్గలేదని లెక్కలు చెబుతున్నాయి.

దుమ్ముధూళితోపాటు పొగమంచు ఢిల్లీవాసులను ఇబ్బందిపెడుతోంది. మరోవైపు సరి-బేసి విధానం కొనసాగించాలా? వద్దా? అన్న విషయంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఢిల్లీలో అమలు చేస్తున్న వాహనాల 'సరి-బేసి' రొటేషనింగ్ స్కీమ్‌ పొడిగింపు ప్రస్తుతానికైదే లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీనిపై ఈనెల 18న తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో ఈనెల 4 నుంచి అమలు చేస్తున్న 'సరి-బేసి' స్కీమ్ ఈ శుక్రవారంతో ముగుస్తోంది.

మరికొద్ది రోజుల పాటు ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతానికైతే గడువు పొడిగింపు లేదన్నారు. గాలి వేగం మెరుగుపడితే 'సరి-బేసి' అవసరం ఉండదని, మరో రెండు రోజులు పరిస్థితిని అధ్యయనం చేసి 18వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న 'సరి-బేసి' విధానం ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వర్తిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై రూ.4,000 జరిమానా విధిస్తున్నారు.