శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (11:23 IST)

టిక్కెట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు సేవించిన ఎంపీ మృతి!!

Ganeshamurthi
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ రాలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈరోడ్ సిట్టింగ్ ఎంపీ గణేశమూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎండీఎంకే పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఈ నెల 24వ తేదీన తన నివాసంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో గణేశమూర్తి మరణించారని వైద్యులు తెలిపారు. 
 
కాగా, గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి భాగస్వామి పార్టీ అయిన ఎండీఎంకే పార్టీ తరపున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన మరోమారు పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతిపట్ల ఎండీఎంకే నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు.