గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (18:54 IST)

బీజేపీ వైపు జేడీఎస్ చూపు!

జేడీఎస్ బీజేపీ వైపు దృష్టి సారించిందా?.. భవిష్యత్తులో బలపడాలంటే ఆ పార్టీని నమ్ముకోవడమే మేలని భావిస్తోందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరని మాజీ ప్రధాని దేవెగౌడ రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించారు. కానీ గురువారం ఒక్కసారిగా మాట మార్చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవరూ వుండరని తేల్చి చెప్పారు. అంతేకాకుండా డిసెంబర్‌లో వచ్చే ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినా, భయపడాల్సిన పనిలేదని, తామున్నామంటూ పరోక్ష సంకేతాలిచ్చారు.

దీంతో జేడీఎస్ బీజేపీవైపు మొగ్గిందని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యడియూరప్పను మీరు శత్రువుగా భావిస్తారా? అని ప్రశ్నించగా, యడియూరప్ప నాకు శత్రువా? అని ఎదురు ప్రశ్నించారు. మాజీ సీఎం సిద్దరామయ్య, తానూ చాలా సార్లు విభేదించుకున్నామని, అయినా సరే ప్రభుత్వాన్ని కలిసి నడపలేదా? అని ప్రశ్నించారు.

సమయాలు, సందర్భాలు ప్రతీదాన్ని మారుస్తుంటాయని, చివరికి స్నేహితులను కూడా మార్చేస్తాయి అని జవాబిచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య స్పందిస్తూ.. ఒకవేళ సిద్దరామయ్య బీజేపీతో కలిసి వెళితే సెక్యులర్ భావజాలనికి చెందిన వారు కాదని ప్రకటించారు. ఇక, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ ఓ అడుగు ముదుకేసి, జేడీఎస్ మతతత్వ పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
 
అబ్బే... అదేం లేదు..
రాజకీయాలకు సంబంధించి మాజీ ప్రధాని దేవేగౌడతో ఎటువంటి చర్చలు జరుపలేదని ఫోన్‌లో సంభాషించలేదని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. ఫోన్‌లో ఇరువురూ సంభాషించుకున్నారనే కథనాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. డాలర్స్‌ కాలనీలోని ఆయన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడారు.

దేవేగౌడకు ఏ అంశంలోనైనా వాస్తవాలు, తీర్మానాలు చేసే శక్తి సామర్థ్యం ఉందన్నారు. నేను ఎటువంటి సందర్భంలోనూ దేవేగౌడ పేరును ప్రస్తావించలేదన్నారు. యాదగిరి జిల్లా గురుమిట్కల్‌ జేడీఎస్‌ నేతపై దాడిచేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేస్తానని దేవేగౌడ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎస్సై సెలవుపై వెళ్లాలని సూచించానన్నారు. అన్నీ దృష్టిలో ఉంచుకునే ఎస్సైపై చర్యలు తీసుకున్నామన్నారు. మధ్యాహ్నం దేవేగౌడ నగరంలో మీడియాతో మాట్లాడుతూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలన్నారు.