బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2019 (16:57 IST)

నేను లక్కీ సీఎంను... ఫడ్నవిస్‌ను విపక్ష నేత అని పిలవను : సీఎం ఉద్ధవ్ ఠాక్రే

తానొక లక్కీ ముఖ్యమంత్రిని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పైగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఆయన్ను విపక్ష నేతగా పిలవబోనని చెప్పారు. పైగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి అని చెప్పారు. 
 
ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఫడ్నవీస్‌తో ఎప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తాను. నేను ఇప్పటికీ హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్నాను. దీన్ని ఎన్నటికీ వీడను' అని చెప్పారు. 
 
'గత ఐదేళ్లలో నేను ప్రభుత్వాన్ని ఎన్నడూ మోసం చేయలేదు. నేను ఫడ్నవీస్‌ను ప్రతిపక్ష నాయకుడని పిలవను. ఆయనను బాధ్యతాయుత నాయకుడు అని పిలుస్తాను. మాతో ఆయన సఖ్యతతో వ్యవహరించినట్లయితే, ఇరు పార్టీల మధ్య చీలిక వచ్చేది కాదు' అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు.
 
'నేను ఓ లక్కీ సీఎంను.. ఎందుకంటే నన్ను వ్యతిరేకించిన వారు నాతో కలిసి ఉన్నారు. గతంలో నాతో కలిసి ఉన్నవారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజల ఆశీస్సులు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను అసెంబ్లీలోకి వస్తానని ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. అయినప్పటికీ ఇక్కడకు వచ్చాను' అని ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు.