1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (14:55 IST)

2015లో రద్దు చేసిన చట్టం కింద కేసులు నమోదా? సుప్రీం ఆశ్చర్యం

గత 2015లో రద్దు చేసిన సెక్షన్ కింద కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 'ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ 2015లోనే రద్దయినా.. ఆ సెక్షన్‌ కింద ఇంకా కేసులు పెడుతుండటం విస్మయం కలిగిస్తోంది. దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇంత ఘోరం జరుగుతోందా? ఆ సెక్షన్‌ కింద నమోదైన కేసుల సంఖ్య చూశాం. భయపడకండి.. మేము ఏదో ఒకటి చేస్తాం’ అంటూ ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
అసలు ఉనికిలోనే లేని చట్టం కింద ఎవరైనా కేసులు నమోదు చేస్తారా? చేస్తే అవి చెల్లుతాయా? ఈ ప్రశ్నలు ఎవరిని అడిగినా లేదనే సమాధానం వస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మాత్రం.. ఆరేళ్ల క్రితమే రద్దయిన చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఒకటో రెండో కాదు.. 38 కేసులు పెట్టారు. వాటిలో 19 న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
 
ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆరేళ్ల కిందట సుప్రీంకోర్టు ప్రకటించింది. దాన్ని రద్దుచేస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఆ తర్వాత కూడా ఆ సెక్షన్‌ కింద పలువురిపై కేసులు పెట్టారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై ఈ సెక్షన్‌ను ప్రయోగించారు. 
 
ఈ సెక్షన్‌ కింద ఇకపై ఎలాంటి కేసులు పెట్టొద్దని, గతంలో నమోదుచేసిన వాటిని ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ చట్టుంపై ఇపుడు మరోమారు చర్చ ప్రారంభమైంది.