1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (14:41 IST)

ధన్‌బాద్ జిల్లా జడ్జి హత్య : సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాధ జిల్లా అదనపు జడ్జి హత్య కేసును ఇపుడు సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బుధవారం ఉదయం జడ్జి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆటోతో ఢీకొట్టి, హత్య చేసి పరారయ్యారు. 
 
సీసీటీవీ ఫుటేజీతో విషయం వెలుగులోకి రావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తమ్ ఆనంద్‌కు చాలా స్ట్రిక్ట్ జడ్జిగా పేరుంది. ఇటీవల కొందరు గ్యాంగ్ స్టర్లకు ఆయన బెయిల్‌ను తిరస్కరించారు. ఆ కక్ష కొద్దీ ఆయన్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
ఈ హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటో విచారణకు స్వీకరించి, హత్య కేసు విచారణలో పురోగతిపై నివేదికను సమర్పించాల్సిందిగా జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను శుక్రవారం సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. దర్యాప్తును జార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా కేసును విచారణకు తీసుకుంది.
 
ఓ జిల్లా జడ్జిని ఆటో రిక్షాతో ఢీకొట్టి హత్య చేయడం దురదృష్టకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఆ వార్తను సరైన రీతిలో ప్రచురించారని, జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కేసును పరిగణనలోకి తీసుకున్నారని గుర్తుచేశారు.