ట్విట్టర్లో పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయనే... పవన్ ట్వీట్స్పై వైకాపా విమర్శ..
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ ట్వీట్స్పై వైకాపా నేతలు గుడివాడ అమర్, ప్రసాద్ రెడ్డిలు స్పందించారు. పవన్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యల్లో ప్రజల కోసమో లేక అభిమానుల కోసమో తాపత్రయం పడుతున్నట్టు ఎక్కడా కనిపించలేదన్నారు. ట్విట్టర్ పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయని పవన్ కొత్తదారి కనిపెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు ఏ నేత ఈ విధంగా అభిమానులను అడ్డంపెట్టుకుని చేయనంత అవినీతిని పవన్ చేస్తున్నాడని తీవ్రంగా ఆరోపించారు. అభిమానులను ఎర చూపి టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లు వేయించి డబ్బు సంపాదించారని మండిపడ్డారు. ఏ విషయం గురించైనా సరే మాట్లాడాలనుకుంటే వెంటనే మాట్లాడాలిగాని, తర్వాత ఎందుకుని ప్రశ్నించారు. తానున్నానంటూ ఇటు ప్రజలను, అటు అభిమానులను పవన్ మోసం చేస్తున్నాడని వైకాపా నేతలు తీవ్రంగా విమర్శించారు.