1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (08:20 IST)

మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను రేపు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు.
 
త్వరలోనే కీలక పరిణామాలు..!
మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు కోర్టుకు చేరింది. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.