1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (10:30 IST)

సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... జంపింగ్ జిలానీలేనా?

revanth - prakash goud
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారు. ఇది జరిగిన రోజులు కూడా గడవక ముందే మరో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎంను కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమే అని బయటకు చెబుతున్నప్పటికీ వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయినట్టు ప్రచారం సాగుతుంది. 
 
తాజాగా సీఎం రేవంత్‌ను ప్రకాశ్ గౌడ్‌ కలిశారు. ఆ సమయంలో రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వీరు దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లు గతంలో తెలుగుదేశం పార్టీ కోసం కలిసి పని చేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన భారాసలో చేరారు. 
 
కాగా, రేవంత్ రెడ్డిని కలవడంపై ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలపై రేవంత్ రెడ్డితో మాట్లాడాని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తాను కోరగా, సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరోవైపు, ఇటీవల ప్రకాశ్ గౌడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన విషయం తెల్సిందే. అపుడు కూడా కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ జరిగినట్టు వెల్లడించారు.