శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా మాజీలపై విచారణ : సీఎం రేవంత్ నిర్ణయం

tspsc
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజా, మాజీ చైర్మన్‌లపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుంది. గత పదేళ్ల కాలంలో టీఎస్పీఎస్సీని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)కు రాజీనామా చేసిన గత బోర్డుపైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 
 
లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకూ పలువురు ఉద్యోగులను అరెస్టు చేయగా ఇప్పుడు బోర్డు తాజా మాజీల పాత్రపైనా దృష్టి సారించినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ పదవులకు చైర్మన్‌, నలుగురు సభ్యులు రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్‌ దర్యాప్తును కొనసాగించాలని, బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. 
 
ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ సభ్యులపై విచారణ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2010లో అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టరుగా పనిచేస్తున్న జగన్మోహన్‌పై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఆయన భార్య అరుణకుమారి అప్పట్లో స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్‌గా పనిచేస్తుండగా.. ఆమెపై కూడా కేసు నమోదైంది. 
 
అయితే వీరిపై చట్టపరమైన విచారణకు బదులు భారీ జరిమానా సరిపోతుందని చెబుతూ.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2013లో ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ దీనిపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకొని వివరాలు అనిశాకు పంపాల్సి ఉంది. అయితే వీరిద్దరిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఏదీ ఇంకా తమకు అందలేదని, దాన్ని వెంటనే పంపాలంటూ అవినీతి నిరోధకశాఖ 2020లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అప్పట్నుంచి సంబంధిత అంశం పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అరుణకుమారిపై ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.