1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:51 IST)

మణిపూర్‌‌లో కిడ్నాప్‌కు గురైన విద్యార్థుల హత్య... ఫోటోలు వైరల్...

manipur students
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో తాజాగా మరో దారుణం జరిగింది. గత జూలై నెలలో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. ఈ ఇద్దరు విద్యార్థుల వెనుక తుపాకీలు చేతబట్టిన సాయుధులు ఉన్నట్టు ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, గత కొన్ని నెలలుగా సాగుతున్న మణిపూర్ అల్లర్లలో ఇప్పటివరకు 180 మంది వరకు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
మణిపూర్‌లోని మెయిటీ తెగకు చెందిన విద్యార్థులు హిజమ్ లింతోయింగంబి (17), ఫిజమ్ హెమిజిట్ (20) అనే ఇద్దరు విద్యార్ధులు గత జూలై నెలలో కిడ్నాప్‌కు గురయ్యారు. అప్పటి నుంచి వీరి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ఓ అటవీ క్యాంపులో గడ్డిపై కూర్చుండగా వెనుక సాయుధులు నిల్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో ఫోటోలో వారిద్దరూ చనిపోయి నేలపై పడివున్నారు. 
 
ఈ ఫోటోలు వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్రంలో మరోమారు నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తున్నారు. ఈ కేసును ఇప్పటికే పర్యవేక్షిస్తున్న సీబీఐ వారి జాడను గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. హత్యకు గురైన ఈ ఇద్దరు విద్యార్థులు జూలైలో ఓ షాపులో వద్దవున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపించారు. ఆ తర్వాత నుంచి వారిద్దరి జాడ తెలియలేదు. ఇపుడు వారిద్దరూ హత్యకు గురైనట్టు ఫోటోలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 
 
ఈ ఘటనపై వేగంగా నిర్ణయాత్నక చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థులు కిడ్నాప్, హత్య వెనుక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. అదేసమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, దర్యాప్తు సంస్థలను వాటి పని అవి చెయ్యనివ్వాలని కోరింది. కాగా, మణిపూర్‌లో మే నెల 3వ తేదీన చెలరేగిన హింసలో ఇప్పటివరకు 180 మంది వరకు చనిపోయారు.