1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో 15 రోజులు ముందుగానే ఇంటర్ పరీక్షలు

exam
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే యేడాది నిర్ణీత షెడ్యూల్ కంటే 15 రోజులు ముందుగానే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి యేటా ఇంటర్ పరీక్షలు మార్చి నెల మూడో వారం నుంచి నిర్వహిస్తుంటారు. అయితే, వచ్చే యేడాది మాత్రం అందుకు భిన్నంగా మార్చి మొదటి వారంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనికితోడు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను ముందుగానే నిర్వహించడం వల్ల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధం కావడానికి సమయం ఉంటుంది. 
 
ఇంటర్ పరీక్షలు ముగిశాక అదే నెల 12న లేదంటే 14 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అలాగే, ఫిబ్రవరి 26 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్చి 1 నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తం అవుతోంది. దామోదర రాజనరసింహ శనివారమే విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనుమతి తర్వాత పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.