తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!
తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలు విడుదల చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణాలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాక ప్రక్రియ పూర్తి కావడం, నూతన విధానంలో మార్కుల మెమోల జారీపై స్పష్టత రావడంతో ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ యేడాది నుంచి టెన్త్ మార్కుల మెమోల విధానంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. గతంలో కేవలం సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏ మాత్రమే ఇచ్చేవారు.
అయితే, ఇక నుంచి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను విడివిడిగా చూపించడంతో పాటు మొత్తం మార్కులు, గ్రేడ్లను కూడా మెమోలో పొందుపరుస్తున్నారు. అలాగే విద్యార్థి ఉత్తీర్ణత (పాస్ లేదా ఫెయిల్) వివారలను కూడా స్పష్టంగా పేర్కొననున్నారు.