శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (14:22 IST)

3 రోజుల పసికందుకు ప్రాణం పోసిన ఆంబులెన్స్ సిబ్బంది..!

3 రోజుల పసికందుకు ప్రాణం పోశారు ఆంబులెన్స్ సిబ్బంది. పసిబిడ్డను 108లో హాస్పిటల్‌కు తీసుకెళుతున్న ఓ పసిబిడ్డకు హఠాత్తుగా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీంతో కన్నతల్లి ఘొల్లుమని ఏడ్చింది. పుట్టి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయని గుండెలవిసేలా ఏడ్చింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆగిపోయిన ఆ చిట్టి గుండెకు ఆయువు పోసారు. తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ తల్లి మనస్సు కుదుటపడింది.  
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లా మంథని మండటం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళ మూడు రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. కాని పుట్టిన కాసేపటికే బిడ్డ అనారోగ్యానికి గురి కావటంతో కరీంనగర్‌లోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కానీ పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని మరో ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆ చంటిబిడ్డ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
 
దీంతో 108 సిబ్బంది బిడ్డను బతకించటానికి బిడ్డకు వెంటనే సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. ఆ వెంటనే బిడ్డకు గుండె తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది. తరువాత అంబులెన్స్ లోనే వైద్యం అందించిన సిబ్బంది వరంగల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. బిడ్డ సురక్షితంగా ఉండటంతో తల్లీ సంతోషించింది. బిడ్డను బతికించిన అంబులెన్స్ సిబ్బందిని బిడ్డ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపగా..గ్రామస్తులు అభినందించారు.