మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాకు ఏమైంది? 30 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ హబ్‌గా రెండు తెలుగు రాష్ట్రాలు మారే ప్రమాదం పొంచివుంది. ఈ రెండు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే, అడ్డూఅదుపు లేకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్క రోజే తెలంగాణాలో ఏకంగా 1924 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 29,836కు పెరిగాయి. అలాగే, 11 మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 324కు పెరిగింది.
 
తాజాగా, 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17,279కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 11,933 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
 
ఇకపోతే, బుధవారం నమోదైన మొత్తం కేసుల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 ఉండగా, ఆ తర్వాత అత్యధికంగా నమోదైన జిల్లాల్లో రంగారెడ్డి (99), మేడ్చల్‌ (43), వరంగల్ రూరల్‌ (26), సంగారెడ్డి (20), నిజామాబాద్‌ (19), మహబూబ్‌నగర్ (15), కరీంనగర్ (14) ఉన్నాయి.  
 
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు అధికం కావడం పట్ల కేంద్రం కూడా ఆందోళన వ్యక్తంచేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ దశకు చేరుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి, ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని సారించాయి.