శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:41 IST)

రూ. 70కోట్ల అక్రమాస్తులు.. ఏసీబీ వలలో మల్కాజిగిరి ఏసీపీ

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం చిక్కుకుంది. మల్కాజ్ గిరి ఏసీపీ అవినీతి బట్టబయలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ నర్సింహారెడ్డి అరెస్ట్‌ అయ్యారు. సుమారు రూ.70 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 
 
గురువారం ఉదయం నుండి 25 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, సైబర్‌ టవర్స్‌ ఎదురుగా 1,960 గజాల భూమి, మరో 4 ప్లాట్లు, హఫీజ్‌ పేట్‌‌లో మూడంతస్తుల కమర్షియల్‌ బిల్డింగ్‌ తో పాటు అక్కడే రెండు ఇండిపెండెంట్ ఇళ్లు గుర్తించగా రూ 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
 
అలానే రెండు బ్యాంక్‌ లాకర్లని గుర్తించారు. లాకర్లు ఓపెన్‌ చేస్తే ఏసీపీ అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ పత్రాలను స్వాధీనం చేసుకుంది. గతంలో ఉప్పల్‌ సీఐగా నరసింహారెడ్డి పని చేశారు. పలు ల్యాండ్‌ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో ఏసీపీ తల దూర్చినట్లు తెలుస్తోంది. నరసింహా రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
 
హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు.  
 
ఏసీపీ నర్సింహారెడ్డి రూ. 70కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, మహేంద్రహిల్స్‌, డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్‌, వరంగల్‌లో 3 చోట్ల, కరీంనగర్‌లో 2 చోట్‌, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్‌లో సోదాలు కొనసాగాయి.