1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (16:16 IST)

టీఆర్ఎస్ సర్కారుకు పోయే కాలం వచ్చింది.. బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ సర్కారుపై ఫైర్ అయ్యారు. పెంచిన విద్యుత్ ధరలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందంటూ ధ్వజమెత్తారు. 
 
కరోనాతో కుదేలై ఇప్పుడే కోలుకుంటున్న ప్రజలపై కరెంట్ ఛార్జీల పెంపుతో మోయలేని భారాన్ని ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమంటూ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవం దారుణమన్నారు.
 
ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్ కు బిల్లులు చెల్లించడం లేదు.. మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదు.. కానీ ఈ లోటును పూడ్చుకునేందుకు సామాన్య ప్రజలపై ఛార్జీల పెంపు పేరుతో భారం మోపడం ఎంత వరకు సమంజసం అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. 
 
క‌రెంట్ ఛార్జీలు త‌గ్గించేవ‌ర‌కు బీజేపీ పోరాడుతుందని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క‌రెంటు ఛార్జీల పెంపుపై ఆందోళ‌న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.