1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (13:42 IST)

హైదరాబాద్‌లో విషాదం: రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు మృతి

హైదరాబాద్‌లో విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు మరణించాడు. గచ్చి బౌలిలోని ఓ బైక్ షోరూమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అర్జున్ గచ్చిబౌలిలోని టీవీఎస్ షోరూమ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఎప్పటిలాగే బుధవారం ఉదయం కూడా యథావిధిగా షట్టర్ తెరిచారు. ఐతే ఆ సమయంలో అర్జున్ కుమారుడు రాజేష్ అక్కడే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఆటో మేటిక్ షట్టర్‌కు చుట్టుకొని చిక్కుకుపోయాడు. 
 
గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు షట్టర్‌ను కిందకు దించారు. అందులో ఇరుక్కుపోయిన రాజేష్‌ను బయటకు తీశారు. ఐతే అప్పటికే తీవ్రంగా గాయపడడంతో రాజేష్ అక్కడికక్కడే మరణించాడు. షోరూమ్ నిర్వాహకులే ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 
గతంలో వాచ్‌మెన్ కుమార్తెకు కూడా విద్యుత్ షాక్ తగిలిందని స్థానికులలు తెలిపారు. ఆ ఘటనలో ఆమె సురక్షితంగా బయపటడినట్లు వెల్లడించారు. ఇప్పుడు రోలింగ్ షట్టర్‌లో ఇరుక్కొని కుమారుడు మరణించినట్లు చెప్పారు. రాజేష్ మృతితో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు షోరూమ్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.