మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (09:02 IST)

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారా? కిషన్ రెడ్డి ఏమంటున్నారు?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని కేద్ర పాలిత ప్రాంతంగా చేయబోతున్నారన ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. 
 
ఈ విషయంలో ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ అబద్ధాలు చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం ఉందంటూ లోక్‌సభలో ప్రస్తావించిన మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌.. తాము సమాధానం చెప్పేలోపే వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. 
 
ఆయన హైదరాబాద్‌లో భాగ్యనగర్‌, గోల్కొండ జిల్లాల నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో తమ అభ్యర్థి రాంచందర్‌రావు మళ్లీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 
 
గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని మజ్లి్‌సతో కలిసి కైవసం చేసుకోవడంపై ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేవలం కమీషన్లు వచ్చే పనులు తప్ప ఏ అభివృద్ధీ జరగలేదని పేర్కొన్నారు. 
 
మండలిలో ప్రజా గొంతుక వినిపించే రామచందర్‌రావు గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఆయన అన్నారు.