1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (10:09 IST)

సీఎం కేసీఆర్ కోలుకోవాలంటూ వారణాసిలో ఫ్లెక్సీలు

తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ఇలాంటి పరీక్షల్లో కరోనరీ యాంజియోగ్రామ్ కూడా ఉంది. 
 
అయితే, కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త, ఆయన్ను ఆస్పత్రిలో స్టెచ్చర్‌లో పడుకోబెట్టి వైద్యులు తీసుకెళుతున్న దృశ్యాలకు సంబంధించిన పోటీలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణాకు చెందిన సాయి అనే వీరాభిమాని ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. శుక్రవారం సాయంత్రం గంగానదిలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించి నదిలోని బోట్లలో కేసీఆర్ ఫ్లెక్సీలను కట్టినట్టు చెప్పారు. 
 
ఫ్లెక్సీలపై దేశ్ కా నేత అంటూ పెద్ద అక్షరాలతో రాసి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఫోటోలను కూడా ముద్రించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు కాశీ విశ్వనాథుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.